10, ఏప్రిల్ 2023, సోమవారం

ఛత్రపతిని అధ్యయనం చేసిన అభినవ శివాజి జ్యోతిబాపూలే

సమాజంలో ఉన్న కులవివక్ష, లింగ వివక్ష వంటి ఎన్నో అసమానతలను రూపుమాపి సమరసతను నెలకొల్పన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్ముడు జ్యోతిరావు పూలే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో గోవిందరావు, చినామా గోవిందరావు దంపతులకు 1827 ఏప్రిల్ 11న జన్మించారు. పులే పాఠశాలకు వెళ్లి చదువుకోవడం తక్కువ కానీ పుస్తక పఠనంపై చాలా ఆసక్తి చూపేవారు. దీనిని గమనించిన అతని ఉపాధ్యాయుడు అతడిని స్కాటిష్ మిషన్ పాఠశాలలో చేర్పించారు అక్కడే తనకు ఆప్త మిత్రుడుగా నిలిచిన బిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణుడితో పరిచయం ఏర్పడింది. పూలే సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా ఎదగడంలో తన స్నేహితుడు ప్రధాన పాత్ర పోషించాడు. పూలే అప్పుడప్పుడు పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు హాజరయ్యేవారు ఆ సమయంలోనే ఒక పెళ్లిలో కుల వివక్ష, లింగ వివక్ష వంటి వాటిని ఎదుర్కొన్నాడు, ఆ క్షణాన్నే వాటిని రూపుమాపాలన్న దృఢమైన సంకల్పం తీసుకున్నాడు.


అభినవ ఛత్రపతి జ్యోతిరావు పూలే

సమాజంలోని అసమానతలను రూపుమాపాలన్న లక్యంతో ముందుకు సాగుతున్న పూలే, వాటిని అధ్యయనం చేయడంలో భాగంగా ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎందరో సంఘ సంస్కర్తలను, ఆధ్యాత్మికవేత్తలను కలిశారు. అందులో భాగంగానే ఛత్రపతి శివాజి యొక్క జీవిత అధ్యయనం చేసి, అతనిపై అభిమానంతో గుర్తింపు లేకుండా పాడుపడిపోయి ఉన్న శివాజీ సమాధిని సొంత ఖర్చులతో పునస్థాపన చేసి ఒక దర్శనీయ స్థలంగా మార్చారు.

సమాజంలోని అసమానతలు రూపుమాటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న పూలే దాని కోసం శ్రమిస్తూ, కుటుంబ పోషణను కూడా నడిపించేవారు. సమాజంలోని లింగవివక్షతను రుపుమాపటంలో భాగంగా ఎన్నో బాల్యవివాహాలను అడ్డుకున్నారు, వితంతు పునర్వివాహాలు జరిపించారు. మహిళల గౌరవాన్ని నిలబెడుతూ చరిత్రలోనే తొలిసారిగా గర్భ నియంత్రణ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించారు. మహిళాభ్యుదయంలో భాగంగానే తన భార్య అయిన సావిత్రి బాయి పూలేకు విద్యాబోధన చేసి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు.


పూలే దంపతులు

సమాజ అసమానతలు రుపుమాపటంలో భాగంగా ప్రజలలో చైతన్యాన్ని, అవగాహనను పెంపొందించడానికి అనేక పుస్తకాలు, వ్యాసాలు రాసి, కవిగా రచయితగా కూడా మన్ననలు పొందాడు. 'సార్వజనిక్ ధర్మ పుస్తక్' అనే పుస్తకం ద్వారా మతపరమైన, సాంఘిక పరమైన ఆచారాలను తీవ్రంగా విమర్శిస్తూ దిశా నిర్దేశం చేశారు. అలాగే పౌరోహిత్య బండారం, గులాంగిరి వంటి మొదలైన రచనలు చేసి తన అక్షరాలను ఆయుధాలుగా మలుచుకున్నాడు.

పురోహితుల అరాచకాలను అడ్డుకునేందుకు సార్వజనిక్ సభను స్థాపించి ప్రజలలో చైతన్యాన్ని నింపాడు. తన సేవా కార్యక్రమాలు విస్తరింపజేసేందుకు సత్యశోధక్ సమాజాన్ని స్థాపించాడు. "మనమంతా దేవుని వారసులం దేవుని దృష్టిలో మనమంతా సమానం ఈ బేధాభావాలు మనం సృష్టించుకున్నవే. నిర్బంధ విద్య, స్వదేశీ భావన, నిరాడంబరతలను అలవర్చేందుకే సత్య శోధక సమాజం" అని పూలే సంస్థ యొక్క లక్ష్యాలను నిర్దేశించారు. సంఘ సంస్కరణకు నడుం బిగించిన మరో సంఘ సంస్కర్త, ఆర్యసమాజ స్థాపకులు దయానంద సరస్వతి పునా పర్యటనకు వచ్చినపుడు అతడిని కలిసి చర్చోపచర్చలు జరిపి సమాజం గురించి ఆలోచించడం ప్రధానమైన విషయం. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబెడ్కర్ కు గురువుగా నిలిచి అనేక విద్యా బోధనలు చేసి, మార్గనిర్దేశం చేశారు.

తన జీవితాన్నే సమాజానికి దారపోసి ఎందరికో దిశానిర్దేశం చేసి, దేశ చరిత్రలోనే ప్రజలచేత తొలిసారిగా మాహాత్మ అని పిలిపించుకున్న జ్యోతిరావు పూలే జీవిత విశేషాలను జ్ఞాపకం చేసుకుని అతడి జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...