10, జూన్ 2023, శనివారం

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడాలను, అమితమైన జ్ఞాసంపదగా పేరొందిన గ్రంథాలయాలను సైతం ధ్వంసం చేయడం మొదలెట్టారు. గజినీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయంపై దండెత్తి అక్కడి సంపదనంతా దోచుకుపోయిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే... కానీ అటువంటి వారు ఆధునిక కాలంలో కూడా మనమధ్యే ఉన్నారని, వారి వల్ల ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారుతున్నాయని గురజాడ ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు.

పెద్ద మసీదు కథను గురజాడ కేవలం 500 పదాల్లో, ముడు పేజీల్లో కూర్చారు. ఇందులోని ప్రధాన పాత్రలు మూడు - నారాయణ భట్టు, పుల్లంభట్టు గురు శిష్యులు, సాయిబు - మసీదులోని ముస్లిం మత ప్రతినిధి. 

గోల్కొండ పాదుషాహి ఫర్మానుల సీలు ఇప్పటి శ్రీ కాకుళంలో విప్పటం చేత దీనికి సికాకోల్, చికాకోల్ అనే పేర్లు వచ్చాయని ప్రజలు అనుకుంటారు కానీ అది నిజం కాదని అక్కడ శ్రీకాకుళేశ్వరుడి దేవాలయం ఉండేదని ఆ దేవాలయం పేరుమీదుగా శ్రీకాకుళం అని పేరొచ్చిందనే చర్చతో కథ ప్రారంభం అవుతుంది. నేడు ఉన్న పురాతన నగరాలకు మన దేవాలయాల పేర్లే మూలమని ముస్లిం పాలన కారణంగా కాలక్రమంలో వాటికి ముస్లిం పేర్లు ఆక్షేపించారని గురజాడ ఈ వాక్యాల ద్వారా తెలుపుతున్నారు.  

కాశీ నుంచి నారాయణభట్టు, పుల్లంభట్టు తాము పుట్టి పెరిగిన నగరమైన శ్రీకాకుళంకు వస్తుంటారు. గురువు నారాయణ భట్టు తన శిష్యుడైన పుల్లంభట్టుతో శ్రీ కాకుళం విశిష్టతను, అక్కడి శ్రీ కాకుళేశ్వర ఆలయ విశిష్టతను చెబుకుంటూ నగరంలోకి ప్రవేశిస్తారు. తన శిష్యుడికి ఆ ఆలయాన్ని చూపిస్తానని ఆ ఆలయ స్థలానికి వెళ్తారు. కానీ అక్కడ దేవాలయం స్థలంలో ఒక పెద్ద మసీదు నిర్మించబడి ఉంటుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన గురువు నారాయణభట్టు చేసేదేమీ లేక తిరిగి కాశీకి వెళ్దామని శిష్యుడితో అంటాడు. ఎలాగూ ఇంతదూరం వచ్చాం కదా దేవాలయం ఎక్కడికి పోయిందో, అక్కడ మసీదు ఎలా ఏర్పాటయిందో తెలుసుకుందామని శిష్యుడు పుల్లంభట్టు అంటాడు. గురుశిష్యులిద్దరూ మసీదులోని సాయిబుని పిలిచి దేవాలయం గురించి అడుగుతారు. అప్పుడు ఆ సాయిబు ఇక్కడ ఎటువంటి దేవాలయం లేదని, ఇక్కడినుండి వెళ్లిపొండని ఆజ్ఞాపిస్తాడు. ఆకలితో ఉన్నామని ఆహారం కోసం దగ్గర్లో తన మావ గార్లైన రామావధానులు, లక్ష్మణ భట్టు గార్ల భోజనశాల ఒకటి ఉండాలని అది ఎక్కడుండని సాయిబును నారాయణభట్టు అడుగుతాడు. ఇలా అడగగానే సాయిబు చేతిలోని చిలుము నేలపై పడి నిప్పులు నాలుగు దిశలకు వెళ్లగా 'నారాయణా!' అని పలకడంతో కథ ముగుస్తుంది.

ఇది చదివాక గురజాడ కథను ఇలా అర్థాంతరంగా ముగించారేమి అన్న అనుమానం కలిగింది. కానీ తర్వాతి కథ పాఠకుల ఊహకే వదిలిపెట్టారన్న దాన్ని గ్రహించేకపోయా. దీనిపై వచ్చిన సమీక్ష చదివాక అసలు విషయం అర్థమైంది. కథలోని ప్రాణమంతా ఇక్కడే ఉందని గ్రహించా. అదేమంటే నారాయణభట్టు తమ మామగార్ల పేర్లు చెప్పగానే "నారాయణా!" అంటూ సాయిబు ఆశ్చర్యపోయారు అంటే ఆ సాయిబే నారాయణభట్టు మామగారన్నమాట. అంటే ముసల్మానుల పాలనా కాలంలో దేవాలయాలను కొల్లగొట్టడమే కాకుండా అమాయకులైన ఇతర మతస్తులను ముస్లిం మతంలోకి మతమార్పిడి చేసుకున్నారని అర్థమౌతుంది.

ఇలా అధికారంలో ఉన్న అప్పటి ముస్లిం మత పెద్దలు చేసిన దురాచారాలను ప్రజలకు తెలియజేసే రీతిలో గురజాడ రచించిన ఈ పెద్దమసీదు కథ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిపోయింది. చిన్న కథే అయినా ఇందులో అద్భుతమైన సందేశాన్నిస్తూ ప్రజలను ఆలోచింపజేసే దిశగా ఈ కథ సాగడం గురజాడ అమితమైన ప్రతిభకు తార్కాణంగా చెప్పవచ్చు.


9, జూన్ 2023, శుక్రవారం

గురజాడ కథా మంజరి - మతం శాస్త్రీయం కాదని నిరూపించిన కథ - " మీ పేరేమిటి? "

"మతములన్నియు మాసిపోవును - జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును" అని ఎలుగెత్తి చాటిన గురజాడ వారి కథ " మీ పేరేమిటి? " "దేవుడు చేసిన మనుషుల్లారా మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటి?" అంటూ ఈ కథ ప్రారంభమవుతుంది. ఈ వాక్యాన్ని బట్టే మనుషులు సృష్టించుకున్న ఎటువంటి ఆధారాలు, హేతువులు లేని రూపమే దేవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు.మనకు మనం నియమానుబద్ధంగా ఉండటానికి ఒకానొక రూపాన్ని మనకంటే గొప్పదిగా భావించి, ఒక పేరు పెట్టి పూజించడమే దైవత్వం అని గురజాడ వారి భావన. ఇదే విషయాన్ని గురజాడ ఈ కథ ద్వారా తెలియజేస్తారు.

ఈ కథలో ముఖ్య పాత్రలు - శరభయ్య  శైవ మత ప్రతినిధి, మానవాళ్ళయ్య వైష్ణవ మత ప్రతినిధి, రంగాచార్యులు విష్ణుక్షేత్రం ధర్మకర్త, కృష్ణమాచార్యులు, నాంచారమ్మ  రంగాచార్యుల కొడుకు, కోడలు, పీరు సాహెబు, ఊరి మునసబు రామి నాయుడు, ఈ కథచెప్పే కథకుడు వర్తకుడు, రామ్మూర్తి బౌద్ధ మత విశ్వాసి, గురువు శాస్థుల్లు, వెంకయ్య ఉపాధ్యాయుడు. 

గురు శిష్య బృందం రామగిరిలో జరిగిన ఒక మతపరమైన సంఘటన గురించి ఒక రోజు రాత్రివేళ చర్చించుకుంటూ ఉంటారు. ఈ చర్చనే "మీ పేరేమిటి?" కథ. ఆ ఊర్లో బుద్ధుడి రూపంలో ఉన్న ఒక దేవుడి కొండని చూసిన శిష్యులు బుద్ధుడు విష్ణువు అవతారం కదా! మరి శైవులు శివలింగమని ఎలా పూజిస్తున్నారనే సందేహం వస్తుంది. దీంతో శాయన్న భక్త దీని వెనక ఈ ఊర్లో జరిగిన ఒక సంఘటన దాగి ఉందని చెబుతూ కథ ప్రారంభిస్తాడు. ఆ ఊర్లో శైవ, వైష్ణవుల మధ్య వైరం ఎక్కువగా ఉండేదని, దానికి వారు పోటీ పడేట్లు ఒకరిని మించి ఒకరు పూజలు చేసేవారని కథ ప్రారంభిస్తాడు.

ఒకరోజు శైవులు నిప్పుల గుండం తొక్కి తమ భక్తి భావాన్ని తెలియజేశారు. అదే తరహాలో వైష్ణవులు కూడా ఏమి తీసిపోరని వైష్ణవ మత ప్రతినిధి పాత్ర అయిన మానవాళ్లయ్యను నిప్పుల గుండం తొక్కించడానికి సిద్ధం చేస్తుంటారు. కానీ ఇతను తప్పించుకొదనికి ప్రయత్నిస్తుంటాడు. ఇదిలా జరుగుతుండగా నాంచారమ్మ వచ్చి ముసల్మానులు వైష్ణవులలో భాగమని చెప్పి పీరు సాహెబు చేతికి పీరును పట్టించి గుండం తొక్కిస్తుంది ఇలా శైవులకు ధీటుగా వైష్ణవులు సైతం గుండం తొక్కగలిగామని వారు భావిస్తారు. ఆ తర్వాత ఆ ఊర్లోని పీరుకు శైవ, వైష్ణవ బేధం లేకుండా పూజలు నిర్వహిస్తుంటారు. అది త్రిశూలాకారంలో ఉంది కాబట్టి శైవ పీరని శైవులు, విష్ణు నామం వలె ఉందని వైష్ణవ పీరని వైష్ణవులు చెబుతారు. ఇలా విష్ణువూ పీరుగా ఉండి, శివుడు పీరుగా ఉన్నప్పుడూ బుద్ధుడు పీరు కారాదా? అంటూ శాయన్న భుక్త కథ ముగిస్తాడు.

ఈ కథలో గురజాడ పలికించిన కొన్ని ఆణిముత్యాల్లాంటి వాక్యాలు చెప్పుకోదగ్గవి...!

"ఈ దేశంలో పాండవులు ఉండని గుహలు, సీతమ్మ స్నానమాడని గుంటలూ లేవు" - ఇది గురజాడ వారు హాస్యంగా చెప్పిన మాట. అంటే ఈ దేశంలోని జనాలు ఏ ప్రాంతాన్ని చూసినా వాటిని పాండవులకో, సీతకో ముడిపెట్టి అవి నిజమనేట్టు కథలు అల్లుతారని రచయిత చెబుతున్నారు.

"రాముడే కాదు, ఏ దేవుని మీదనైనా నిజమైన నమ్మకమన్నది యేడిస్తే ఒక్క గుండవే కాదు, అన్నీ కష్టాలూ తరించవచ్చు" - ఏ దేవుడిని పూజించినా సరే నమ్మకంతో పూజిస్తే ఎన్ని కష్టాలైనా దాటగలమనే ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది ఈ వాక్యం. విష్ణుభక్తులు శైవులలాగా అగ్ని గుండం తొక్కాలని ప్రయత్నించే సందర్భంలో గురజాడ పలికించిన మాటలివి.

"శివుదన్నా, విష్ణువన్నా, బుద్ధుడన్నా, పీరన్నా పరమాత్మ మాత్రం ఒక్కడే కదా!" - శాయన్న భుక్త కథ పూర్తి చేసిన అనంతరం రచయిత ఈ వాక్యాన్ని  పలికిస్తాడు. దీన్ని విన్నప్పుడు ఎంతమంది దేవుళ్ళను ఎన్ని రకాల పేర్లతో పిలుచుకున్నా దేవుడు మాత్రం ఒక్కడే అతడే పరమాత్మ అన్న ఆధ్యాత్మిక ప్రవచనం మనకు బోధపడుతుంది.

"అందరు దేవుళ్ళు ఒక్కరే అయితే, ఆ పీనుగుల్ని అందరినీ ఒక్కచోటే నిలిపి అందరూ కలిసి పూజ తగలెట్టరాదా?" - కథ పూర్తయిన తర్వాత అత్యంత ఆవేశంతో, మత సమాజం పట్ల నిరసనా భావంతో వెంకయ్యచే గురజాడ పలికించిన మాటలివి. అందరు దేవుళ్ళు ఒక్కరే అయినపుడు వారందరినీ ఒకే దగ్గర పూజించొచ్చు కదా! అని దీనర్థం. దేవుళ్ళందరూ ఒక్కటే కానీ వారిని పూజించే మనుషులు మాత్రం వేరువేరు ఆలోచనలతో ఉన్నారన్న కోపం ఈ మాటల్లో వ్యక్తం చేశారు గురజాడ.

ఏదేమైనా మనిషి ఆధ్యాత్మికంగా, నైతికంగా, బౌద్ధికంగా తనను తాను మలుచుకోడానికి తనకంటే గొప్పదైన భావనను కల్పన చేసుకొని పూజిస్తున్నాడని గురజాడ గారి అభిప్రాయం. ఎటువంటి హేతువులు లేని పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, లేనిపోని పద్ధతులను విచక్షణా రహితంగా పాటిస్తున్నారని ఈ  కథ ద్వారా గురజాడ ఆక్షేపిస్తున్నారు



7, జూన్ 2023, బుధవారం

గురజాడ కథా మంజరి - ఆదర్శ గృహిణి "మెటిల్డా"

ఆదర్శ గృహిణి "మెటిల్డా" 

గురజాడ రచనల్లో ప్రధాన వస్తువు స్త్రీ చైతన్యం. ఒక సంఘ సంస్కర్తగా సమాజాన్ని ఏ విధంగా సంస్కరించాలో అనేక కథల ద్వారా ఎలుగెత్తి చాటారు... వాటిల్లో ఒకటే 'మెటిల్డా'. గురజాడ తన బహుముఖ ప్రజ్ఞ ద్వారా ఈ కథలో సృష్టించిన పాత్రలు ఆరు. కానీ ఇందులోని రెండు పాత్రలకు మాత్రమే పేర్లు పెట్టారు. అవి: మెటిల్డా - ఈ కథలో కథానాయిక, రామారావు - కథ చెప్పేవాడి స్నేహితుడు. కథ చెప్పేవాడికి, మెటిల్డా భర్తకు, భర్త తండ్రికీ, ఇంటి వంట వాడికి పేర్లు పెట్టలేదు. ఇందులో కథ చెప్పేవాడు, మెటిల్డా, మెటిల్డా భర్త, రామారావు ప్రధానమైన పాత్రలు.

మెటిల్డా ఒక అందమైన, ఆదర్శ భావాలు కలిగిన, సంస్కృతీ సంప్రదాయాలు తెలిసిన గృహిణి. ఈమె 55 సంవత్సరాలు కలిగిన ఒక ముసలి భర్తతో జీవనం గడుపుతూ ఉంటుంది. భర్త కొట్టినా తిట్టినా చివరకు అవమానించినా, భర్తను సైతం చక్కదిద్ది భర్తతోనే తన జీవితమని జీవనం సాగించే ఆదర్శ మహిళగా ఎంతో మంది స్త్రీమూర్తులకు దిశా నిర్దేశం చేస్తుంది మెటిల్డా. వీళ్ళ ఇంటికి సమీపంలో ఉన్న కాలేజి యువకులతో మెటిల్డాకి సమస్య మొదలౌతుంది. వారు మెటిల్డా ముసలి భర్తను ముసలి పులి అని పిలుస్తుంటారు. ఆ కాలేజీ యువకుల్లో ఒకడు ప్రతిరోజూ మెటిల్డాను చూస్తూ ఉంటాడు. ఈ యువకుడే ఈ కథను తన స్నేహితుడైన రామారావు అనే పాత్రతో చెబుతుంటాడు.  ఈ ఉదంతాన్ని గమనించిన మెటిల్డా  భర్త ఆ యువకులను ఇంటికి పిలిచి కోపంతో మెటిల్డాను ఎన్ని సార్లు చూస్తావో చూడమని విరుచుకుపడతాడు. 



మరొకసారి మెటిల్డాను చూడకూడదని గట్టి నిర్ణయం తెసుకొని ఇంటిని చేరుతాడు ఆ యువకుడు. మెటిల్డా తన వంట మనిషి సహాయంతో "మీరు మీ నేస్తాలు నా కాపురాన్ని పాడుచేయాలనుకుంటున్నారా? మీకు నేను ఏం అపకారం చేశాను? తల వంచుకొని మీ దారిలో మీరు పోతే సరి" అని లేఖ రాసి పంపిస్తుంది. ఇది చదివిన ఆ యువకుడు పశ్చాత్తాపం చెంది స్నేహితుడు రామారావుతో నువ్వొద్దన్నా నేను మెటిల్డాను చూడటం మానలేదు.. ఇప్పుడు మెటిల్డాను రక్షించడానికి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు ఏమైనా సహాయం చేయమని వేడుకుంటాడు. ఈ సందర్భంలో కవి రామారావుతో రెండు మంచి మాటలు పలికిస్తాడు.

1. ఆలు మొగుళ్ళ దెబ్బలాటల్లోకి వెళ్లవద్దని మన పెద్దల శాసనం, అవి అబేధ్యాలు, ఆగమ్య గోచరాలు. మధ్యవర్తులు కాపరం చక్కచేదావని చెక్కలు చేసి వెళ్ళిపోయి వస్తారు.

2. చెడ్డ తలంపు చెప్పిరాదు. ఎక్కణ్ణించో రానక్కర్లేదు. కంటికి కనబడకుండా మనసులో ప్రవేశించి పొంచి ఉంటుంది. 

అని ఆ యువకుడికి రామారావు బుద్ధి చెబుతాడు. వీరిలో వచ్చిన మార్పును గమనించిన మెటిల్డా భర్త తన తప్పును తెలుసుకొని భార్యను అవమానించడం మానుకుంటాడు. ఎంత మంది యువకులు మెటిల్డా వైపు చూసినా ఆమె వారి పట్ల ఆకర్షితురాలు కాకపోవడంలో మెటిల్డా మంచితనాన్ని గుర్తిస్తాడు. చివరకు ఆ యువకులను ఇంటికి పిలిపించి మెటిల్డా చే కాఫీ ఇప్పిస్తాడు. వారి వల్లే తనకు తన భార్య పట్ల గౌరవం పెరిగిందని, ఆ నాటి నుండి మెటిల్డా స్వేచ్ఛకు భంగం కలిగించనని గట్టి నిర్ణయం తీసుకుంటాడు.

కుటుంబ జీవితంలో భర్తకు సగభాగం భార్య కాబట్టి భార్యా భర్తలు ఒకరి ప్రేమను ఒకరు గౌరవించి స్వేచ్ఛగా జీవనం గడపాలని ఇందులోని ఆదర్శ గృహిణి మెటిల్డా మనకు తెలుపుతుంది.


గురజాడ కథా మంజరి - స్త్రీ దిద్దిన "దిద్దుబాటు"

 "దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్" అని ఎలుగెత్తి చాటిన గురజాడ తెలుగు వారి పాలిట వెలుగుజాడ. సమసమాజాన్ని సంస్కరించాలనే ఉద్దేశ్యంతో ఎన్నో రచనలు చేస్తూ, కథల ద్వారా, నాటకాల ద్వారా ప్రజల్లో నూతన చైతన్యం తీసుకొచ్చిన సాహిత్య పిపాసి గురజాడ. గురజాడ పేరు వినగానే దిద్దుబాటు, మెటిల్డా, మీ పేరేమిటి, మతము విమతము, సౌదామిని, సంస్కర్త హృదయం అనే కథలు గుర్తొస్తాయి. ఈ ఆరు కథలను ఒకే చోట చదివేందుకు వీలుగా ప్రధాన సంపాదకులుగా డా. కొవ్వలి గోపాల కృష్ణ గారు, సహాయ సంపాదకులుగా ఆచార్య రాచపాలెం చంద్రశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన "వసివాడని సాహిత్యం గురజాడ కథా మంజరి" అనే పుస్తకం సాహిత్యాభిమానులకు, కథాప్రియులకు నూతన ఉత్తేజాన్ని నింపుతోంది. గురజాడ వారి ఆరు కథలతో పాటుగా ఆ కథలపై వచ్చిన సమీక్షా వ్యాసాలను కూడా చేర్చడం ఈ పుస్తకం ప్రత్యేకత. ఈ ఆరు కథలను చదివాక వాటి గురించి మీకూ కొంత పరిచయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాశాను.

ఈ పుస్తకంలోని మూలకథలను చదివినప్పుడు అర్థం చేసుకోవడంలో నాకు కొంత ఇబ్బందిగా అనిపించినా ఆ కథలపై వచ్చిన సమీక్షా వ్యాసాలను చదివాక చాలా సులభంగా అనిపించింది. కథలను ఎలా సమీక్షించాలి? కథల ద్వారా రచయిత సమాజానికి ఎటువంటి సందేశం ఇవ్వదలచుకున్నాడు? ఏ కథను ఏ దృష్టి కోణంతో చూడాలి? అనే విషయాలను గురించి ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. 

 స్త్రీ దిద్దిన "దిద్దుబాటు"

ఇక పుస్తకంలోకి వెళ్తే... మొట్టమొదటి కథ 'దిద్దుబాటు'. తెలుగు సాహిత్యంలో తొలి కథానికగా ప్రసిద్ధి చెందిన 'దిద్దుబాటు' సమాజంలో వేశ్య వృత్తికి అలవాటుపడ్డ వ్యక్తుల ప్రవర్తనను దిద్దుబాటు చేస్తుంది. ఈ కథానిక కేవలం నాలుగు పేజీలలో అత్యంత అద్భుతంగా సమాజానికి దిశా నిర్దేశం చేస్తూ సాహిత్య చరిత్రలో నిలిచిపోయింది. నాటి కాలంలో వేశ్యల పట్ల ధనవంతులు, విద్యావంతులు సైతం వ్యామోహం చూపే వారు. అటువంటి వేశ్యా వ్యామోహంలో పడ్డ భర్తను భార్య ఏ విధంగా సరిదిద్దిందనేదే ఈ కథానిక సారాంశం. అందుకే దీనికి "దిద్దుబాటు" అనే పేరు పెట్టారు. ఇది తొలిసారి 1910లో ఆంధ్రభారతి పత్రికలో ప్రచురించబడింది. ఇందులోని పాత్రల మధ్య సంభాషణ వాడుక భాషలోనూ, కథా కథనం సులభ గ్రాంథికంలో కనిపిస్తుంది.

ఇందులోని పాత్రలు- కమలిని,గోపాలరావు భార్యా భర్తలు. రావుడు వీరి ఇంటి పాలేరు. గోపాలరావు వేశ్యల పట్ల ఆకర్షితుడై ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా వస్తుంటాడు. దీనిని గమనించిన కమలిని పాలేరు రావుడి సహాయంతో ఒక మంచి ఉపాయం ఆలోచించి గోపాలరావుపై ప్రయోగించి, అతడికి బుద్ధి వచ్చేట్టు చేస్తుంది.

సంక్షిప్త కథ: రాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన గోపాల రావుకు భార్య కమలిని కనిపించదు. ఇల్లు, పడకగది అంతా వెతుకుతాడు. దీపం వెలిగించి మరీ వెతుకుతాడు. కానీ భార్య కనిపించదు. బుద్ది తక్కువ పనిచేశానని బాధపడతాడు. భార్య ఏమైందోనని పరిపరి విధాలా ఆలోచిస్తాడు. భార్య కనపడలేదన్న కోపంతో పాలేరు రావుడుపై చేయిచేసుకుంటాడు. వెంటనే తప్పుతెలుసుకుంటాడు.

      బల్లపై భార్యరాసిన ఉత్తరం కనిపిస్తుంది. ఆ ఉత్తరంలో-

'..... నా వల్లే కదా మీరు అసత్యాలు పలుకవలసి వచ్చింది. మీ త్రోవకు నేను అడ్డుగా ఉండను. ఈ రేయి కన్న వారింటికి వెళ్తున్నాను.' అని రాసి ఉంటుంది.

దాంతో గోపాలరావు ఆశ్చర్య పోయి, విద్యావతి, గుణవతి అయిన భార్య తనకు తగిన శాస్తి చేసింది అని వ్యాకులత చెందుతాడు. నౌకరికి పది రూపాయలిచ్చి కమిలినిని బతిమిలాడి తీసుక రమ్మంటాడు. 'తప్పు తెలుసుకున్నాను, ఇక ఎప్పటికీ వేశ్యల ఇంటికి వెళ్లను, రాత్రులు పూట ఇల్లు కదలను, తను లేకుండా నేను ఉండలేను' అని భార్యకు చెప్పమంటాడు.

ఇదంతా మంచం కిందనుంచి వింటున్న కమలిని తన భర్తలో వచ్చిన మార్పుకు సంతోషించి నవ్వుతూ బైటకు వస్తుంది. ఇలా కథ ముగుస్తుంది.

ఈ కథలో గురజాడ చెప్పిన కొన్ని నీతి వాక్యాలు: 

1. వేశ్యావృత్తిని నిరాకరించడం. 

2. 'శివుడు పార్వతికి సగం దేహం పంచి యిచ్చాడు కాదా, ఇంగ్లీషువాడు భార్యను బెటర్ హాఫ్ అంటాడు. అనగా పెళ్ళాం మొగుడి కన్నా దొడ్డది అన్నమాట' - రచయిత దీని ద్వారా కుటుంబంలో భార్యాభర్తలు సమానం అనే భావనను కలుగజేస్తున్నాడు. 

3. 'భగవంతుడి సృష్టిలో కల్లా ఉత్కృష్టమయిన వస్తువు విద్యనేర్చిన స్త్రీ రత్నమే....  నీ కూతుర్ని బడికి పంపుతున్నాం కదా, విద్య యొక్క విలువ నీకే బోధపడుతోంది.' అని గోపాలరావు చే చెప్పించిన ఈ మాటలు స్త్రీ చైతన్యానికి విద్యే మూలమని సూచిస్తున్నాయి.

ఈ కథలో రావుడి పాత్రద్వారా సున్నితమైన హాస్యాన్ని సృష్టించాడు గురజాడ. పాత్రలకు తగిన భాషను వాడుతూ, కథారచనలో వ్యవహారిక భాషకు పట్టం కట్టాడు. "మాతృవత్ పరదారేషు..." అని బోధించిన భారతీయ సంస్కృతిని గురజాడ గుర్తుచేస్తూ... మహిళలు అనుకుంటే ఎంతటి పెను ప్రమాదాన్నైనా దాటవచ్చని, సమ సమాజాన్ని సైతం మార్చగలిగే శక్తి భారతీయ మహిళలకు ఉంటుందనే విషయాన్ని గురజాడ ఈ కథానిక ద్వారా తెలియజేశారు.


ఇక గురజాడ కథా మంజరిలోని తర్వాతి కథ - మెటిల్డా పై క్లిక్ చేయండి

2, జూన్ 2023, శుక్రవారం

జీవిత సత్యాలను తెలిపే పుస్తకం జీవనలిపి నానీలు

కేవలం 4 పాదాల్లో, 20 నుండి 25 అక్షరాల్లో జీవితాన్నే తెలపగలమనే సత్యాన్ని డా. ఎస్ రఘు గారి  జీవనలిపి నానీల పుస్తకం రుజువు చేసింది. నావీ నీవీ వెరసి మనవిగా నిలిచిన నానీల ప్రక్రియ తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. కవి తను చెప్పాలనుకున్న విస్తృతమైన భావాన్ని నాలుగు మాటల్లో ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పడమనేది నానీల ప్రక్రియలో ఉన్న ప్రత్యేకత. ఇప్పుడిప్పుడే రచనలు చేయడం నేర్చుకుంటున్న నాలాంటి వారికి ఈ పుస్తకం చక్కటి గురువు పాత్ర పోషిస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.



ఈ పుస్తక రచయిత డా.ఎస్ రఘు గారు కవి, రచయిత, విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు. వీరు పాఠశాల ఉపాధ్యాయుడుగా, జూనియర్ మరియు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయం పరీక్షా విభాగంలో, తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా తన వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి పి.జి. స్థాయి పాఠ్యపుస్తకాల వరకు సంపాదకులుగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన 2023లో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులుగా ఎంపికయ్యారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల లైబ్రరీలో మొదటిసారి ఈ పుస్తకాన్ని చూసి అందులోని రెండు మూడు నానీలు చదివా.... ఇక నా కళ్ళు, నా మనసు నా మాట వినలేదు అలా ఒక పదిహేను ఇరవై నానీలు చదువుతూ.... అందులోని భావాన్ని అర్థం చేసుకుంటూ... నా జీవితంలోని అటువంటి సంఘటనలను నెమరేసుకుంటూ వెళ్ళిపోయా...! చదివిన అరగంటలో నన్ను ఎంతగానో ప్రభావితం చేసిన ఆ పుస్తకాన్ని ఎలాగైనా సంపాదించాలన్న సంకల్పంతో మా తెలుగు శాఖలో అధ్యాపకులుగా పని చేస్తున్న ఈ పుస్తక రచయిత రఘు గారిని సంప్రదించి పుస్తకాన్ని సంపాదించా... ఇంకేముంది ఈ పుస్తకాన్ని గురించి ఎన్. వేణుగోపాల్ గారు "చదువరులకు రెక్కలు తొడిగే పుస్తకం" అని చెప్పినట్టు నాకూ రెక్కలొచ్చేశాయ్...! అలా ఎగురుతూ పోయా....!

ఇలా నానీల ఆకాశంలో ఎగరడం నాలో ఎంతో సంతోషాన్ని నింపింది. ఒత్తిడి కలిగినప్పుడల్లా ఒకసారి పుస్తకాన్ని తెరిచి అలా విహరించి వచ్చేస్తే... ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. ఒకసారి చదివిన నానీలను మళ్ళీ ఎన్ని సార్లు చదివినా చదివిన ప్రతీసారి ఏదో ఒక కొత్త భావన నాలో నిండినట్టు అనిపిస్తుంది. ఇలాంటి భావన మీకూ కలగాలన్న ఉద్దేశ్యంతో ఈ పుస్తకంలోని కొన్ని నానీలను మీకు పరిచయం చేస్తూ ఈ చిట్టి వ్యాసాన్ని రాస్తున్న... ఇక పుస్తకంలోకి వెళ్తే...

మన జీవితంలోని కొన్ని కొన్ని సంఘటనలను గుర్తు చేసే నానీలు ఈ పుస్తకంలో ఉన్నాయని చెప్పా కదా! ఇదిగో ఈ నానీ చూడండి...

దొంగ వర్షం
బడికెళ్లాక కురుస్తుంది!
దొంగ జ్వరం
ఇంట్లోనే వస్తుంది!

దీన్ని చదివిన వెంబడే రెండు నిమిషాలు నాలో నేనే నవ్వుకున్నా...! పాఠశాలకు అలవాటుపడుతున్న చిన్న పిల్లల మనస్తత్వాన్ని ఎంతో చమత్కారంగా ఆవిష్కరించిందీ నానీ. చిన్నప్పుడు నేను కూడా స్కూల్ కి వెళ్లాలంటే బాగా మారాం చేసేవాణ్ణి. స్కూల్ కి బయల్దేరే సమయంలో భీభత్సమైన వర్షం కురిస్తే ఎంత బాగుండో అనిపించేది...! కానీ రఘు గారు చెప్పినట్టు అది దొంగ వర్షం కాబట్టి బడికెళ్లాకనే కురిసేది. ఇక దొంగ జ్వరం సంగతి అందరికీ తెలిసిందే... బడికెళ్ళాలంటే జ్వరం వచ్చినట్టు నటించిన రోజులెన్నో..!

యవ్వనంలో అబ్బాయిలూ అమ్మాయిలూ ఆకర్షితులవడం సహజం. కొన్ని సంవత్సరాల క్రితమైతే ప్రేమ లేఖల ద్వారా ప్రేమికులు వారి వారి భావాన్ని కవితాత్మకంగా రాసి తెలుపుకునే వారు. కానీ నేటి కాలంలో యువత నేరుగా  విషయాన్ని మూడు ముక్కల్లో చెప్పి ప్రేమ వలల్లో చిక్కుకుంటుంది... ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ ప్రేమ లేఖల అవసరం వచ్చిందంటూ రాసిన ఈ నానీ చూడండి...

ప్రేమికులు
పాతబడిపోయారు
ప్రేమలేఖల అవసరం
మళ్ళీ వచ్చింది!

ఇక్కడ ప్రేమికులు పాతబడటం అంటే... పాత పద్ధతులను పాటిస్తూ ప్రేమ కవిత్వం రాస్తూ వారి ప్రేమను చాటుతున్నారని అర్థం. ఇలా ప్రేమికుల మనసును ఆకట్టుకునే నానీలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి...

జ్వరాన్ని
కొలవడానికి థర్మామీటరా
నీ కరస్పర్శ
చాలదూ!

జ్వరాన్ని కొలిచే థర్మామీటరుతో ప్రేయసి కరస్పర్శను పోల్చడమనేది రచయిత విశాల హృదయానికి తార్కాణంగా చెప్పవచ్చు.

సమాజంలో కొందరు ఎలా ఉంటారంటే కోకొల్లలుగా నీతులు చెప్పినా వాటిని ఆచారణలో మాత్రం పెట్టరు. అటువంటి వారి మనస్తత్వాన్ని ఏ విధంగా తెలిపారంటే...

అతనిది
మరీ విడ్డూరం!
పుష్పవిలాపం వింటూ
పూలు కోస్తుంటాడు.

పూలు కోస్తున్నపుడు అవి పడే వేదనను కరుణశ్రీ పుష్పవిలాపం పేరుతో ఒక చక్కటి కవితా ఖండిక రచించారు. ఒక వ్యక్తి దాన్ని వింటూ పూలు కోయడమంటే... చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టే! నేటి సమాజంలో ఉన్న ఇలాంటి వ్యక్తుల గురించి చెప్పిన ఈ నానీకి తిరుగులేదంటే అతిశయోక్తి కాదనుకోండి!

కొన్ని నానీలు హాస్యాన్ని కూడా పుట్టిస్తాయి అందులో ఒకటి..

టెలిఫోన్ తీగమీద
ఒంటరి పక్షి!
మన మాటల్ని
వింటుందా!

ఈ నానీ "గోడలకు కూడా చెవులుంటాయి జాగ్రత్త!" అనే నానుడిని గుర్తు చేస్తుంది. పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, రహస్యమైన మాటలు మాట్లాడడానికి సెల్ ఫోన్ సరైన మాధ్యమం కాదని ఈ నానీ నొక్కివక్కాణిస్తుంది. అటువంటి సందర్భాల్లో నేరుగా మాట్లాడడమే శ్రేయస్కరమని తెలుపుతుంది.. నిజమే కాదా!! ఫోన్లో మాట్లాడేటప్పుడు మన మాటలు ఇక్కడి నుండి అక్కడి వరకూ పోతున్నాయంటే మధ్యలో మూడో వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారని ఎందుకనుకోకూడదు??  ఆ వ్యక్తి మన మాటలు వింటున్నాడని కూడా ఎందుకనుకోకూడదు?? ఆ మధ్యలో ఉన్న మూడో వ్యక్తిని టెలిఫోన్ తీగమీద వాలిన ఒంటరి పక్షిగా మార్చాడు... మన రచయిత.

నీతి శతకాలలో తెలిపే భావాలను సైతం నానీలు తెలియజేస్తాయని నిరూపించే నానీలూ జీవనలిపిలో కనిపిస్తాయి..

పాలలో
నీళ్లు కలిపినంత ఈజీగా
మాటల్లో
విషం నింపుతున్నాం!

శారీరకంగా దెబ్బ తగిలితే కొన్నిరోజులకది తగ్గిపోతుంది కానీ మానసికంగా కలిగిన గాయాలకు మందులేదు. మానసిక గాయాలకు కారణం ఎదుటివారి మాటలే. అంటే వాక్కుకు ఎంతటి శక్తి ఉంటుందో అర్థమౌతుంది. ఇచ్చిన లక్షల రూపాయలైనా వెనక్కు తీసుకోగలం కానీ ఆడిన మాట వెనక్కు తీసుకోలేమనే నానుడి ఈ నానీ ను సమర్థిస్తుందని చెప్పవచ్చు. ఆధునిక సమాజంలో రకరకాల మాధ్యమాల కారణంగా మన మాటలు కలుషితం అవుతున్నాయి. ధనం లేకపోయినా సరే, కానీ మాట్లాడే మాటలు తీయగా ఉంటే మనసుల్ని ఆకట్టుకుంటాయి. కాబట్టి అటువంటి మాటల్లో విషం కలిపితే ఎదుటివారు మనకు శత్రువులుగా మారిపోతారు. ఇక్కడ మాటలు కలుషితం అవ్వడాన్ని పాలల్లో నీళ్లు కలపడం అనే దానితో ఉపమానం వేసి ఇంతటి విశాలమైన అర్థాన్ని నాలుగుముక్కల్లో చెప్పారు రచయిత.

ఆధునిక కాలంలోని యువతకు తినడానికి తిండిలేకున్నా బ్రతకగలుగుతున్నారేమో కానీ సెల్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేక పోతున్నారు..

సెల్ ఫోన్
మ్రోగింది
ఏకాంతపు గుండెల్లో
ముల్లు గుచ్చుకుంది!

వారానికి మూడుగంటల కంటే అధికంగా ఫోన్ మాట్లాడితే  రక్తపోటు సమస్య వస్తుందని తాజా పరిశోధనలు వెల్లడించాయి. గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం ఒక సరదా అయిపోయింది... ఒంటరిగా ఉన్నపుడు పుస్తకాలను స్నేహితులుగా మార్చుకోవాల్సిన యువత సెల్ ఫోన్ ను స్నేహితుడిగా మార్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. దీన్ని చదివినప్పుడు నా ఏకాంతపు గుండెల్లో కూడా ముల్లు గుచ్చుకుంది... దాన్ని తీయడానికి పుస్తకాన్ని మొత్తం చదివేశా...!

దీన దళిత దుఃఖితుల జీవనాన్ని తెలిపే నానీలూ ఇందులో ఉన్నాయి. ఇది చూడండి..

దారిద్ర్యం కూడా
ఒక ఆల్కేమీ
దాని రహస్యం
ఒక్క పేదవాడికే తెలుసు!

కవిత్వం ఒక ఆల్కేమీ దాని రహస్యం ఒక్క కవికే తెలుసు అన్న తిలక్ గారి ఆలోచనలతో దారిద్రాన్ని సైతం ఆల్కేమీగా మలిచి, పేదవాడికే అందులోని కష్టాలు, బాధలు, తెలుస్తాయి. పేదవారే అందులోని రహస్యాలను అర్థం చేసుకోగలుగుతారు... కష్టాలను గురించి మాటల ద్వారా ఎంత చెప్పినా వృధానే కాబట్టి ప్రత్యక్షంగా అనుభవిస్తేనే తెలిసొస్తుందనే భావనతో రాసిన ఈ నానీ పేదవాడి గుండెలను హత్తుకుంటుంది.

ఎవరి జీవితంలో అయినా రెండు విభాగలుంటాయి. ఒకటి పెళ్లికి ముందు.. మరొకటి పెళ్లికి తర్వాత.. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉంటుందో నాలుగు మాటల్లో చెప్పిన ఈ నానీ చూడండి...

శుభలేఖలో
ఏదో అచ్చుతప్పు
సర్దుకుపోవడం
అక్కడ్నుంచే మొదలు!

బ్యాచిలర్ జీవితంలో వివాహానికి ముందు ఎంతో స్వేచ్ఛగా ఎక్కడికైనా తిరుగుతూ... ఎవరికి  ఇష్టమొచ్చినట్లు వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు.. ఒక్కసారి వివాహం అయిందంటే బరువు బాధ్యతలు తలపై వచ్చి పడతాయి... బాధ్యతగా నడుచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో పాటు కొన్ని కొన్ని విషయాలు నచ్చకపోయినా సర్దుకుపోవాల్సిన సంఘటనలు ఎదురౌతాయి. అలా సర్దుకుపోవడం అనేది వివాహ శుభలేఖలో పడ్డ అచ్చుతప్పుతోనే మొదలౌతుందని రచయిత చాలా చమత్కారంగా తెలిపారు.

ఇలా ఇంకెన్ని నానీలను పరిచయం చేసినా తక్కువే... దాన్ని మీరూ చదివితేనే అనుభవించగలుగుతారు.

పుస్తకాలకు
రెక్కలుండవు
చదివితే
మనకు పుట్టుకొస్తాయి

అని రచయిత చెప్పినట్టు... చదివితే తప్ప రెక్కలు పుట్టవు... ఒక్కసారి చదవడం మొదలెట్టామంటే అలా నానీల ఆకాశంలో ఎగురుతూ వెళ్ళిపోతాం. మీరూ రెక్కలు తొడుక్కోవాలనుకుంటున్నారా అయితే మా గురువు గారి జీవనలిపి నానీలు చదవాల్సిందే....!


~~మ్యాడం అభిలాష్

14, ఏప్రిల్ 2023, శుక్రవారం

అంబేద్కరుడి ఆణిముత్యాలు

సమస్త భారతావని గర్వించదగ్గ దేశభక్తుడు, భరతమాత ముద్దుబిడ్డ డా.బి.ఆర్ అంబేద్కర్ నోటినుండి జాలువారిన కొన్ని ఆణిముత్యాలవంటి అక్షరాలను ఏరుకొని భద్రంగా దాచుకోండి.....




  • నేనూ,నా దేశం ఈ రెండింటిలో నా దేశమే నాకు ముఖ్యమైనది.
  • ముస్లింలు, క్రైస్తవులు, పారశీకులు కాని భారతీయులందరూ హిందువులే.
  • తమ తోటి స్వయంసేవకుని కులం తెలుసుకోవాలనే కనీస కుతూహలం కూడా లేకుండా సమరసతా భావనతో మెలుగుతున్న RSS నడవడిక నన్నెంతగానో ఆశ్చర్యపరిచింది. (13 మే 1939నాటి పునాలోని ఆరెస్సెస్ శిబిరంలో)
  • మనిషికి, మనిషికి మధ్య ఉన్న అసమానత్వమే బాధలన్నిటికీ కారణం.
  • గట్టి ఇటుకలు భవనాన్ని నిలబెట్టినట్లే విద్యార్ధులు సత్ప్రవర్తనతో దేశాన్ని నిలబెట్టుకోవాలి.
  • కేవలం పుస్తకాలు చదివి వదిలేస్తే ప్రయోజనం ఏముంది? చెదపురుగులు కూడా పుస్తకాలను నమిలేస్తాయి..అంతమాత్రాన జ్ఞానం వచ్చేసినట్టా.
  • పుస్తకాలు దీపాలవంటివి. వాటిలోని వెలుతురు మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది.
  • మండిన కొవ్వొత్తి మనది కానట్లే గడచిన కాలమూ తిరిగిరాదు.
  • కులం పునాదుల మీద మీరు దేనిని సాధించలేరు. ఒక జాతిని నిర్మించలేరు, ఒక నీతిని నిర్మించలేరు.
  • దేశానికి గానీ,జాతికి గానీ సంఖ్యా బలమొక్కటే చాలదు. ఎప్పుడూ అప్రమత్తులై, విద్యావంతులై ఆత్మగౌరవంతో,ఆత్మ విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుంది.
  • కళ్లు అంటే విజ్ఞానపు వాకిళ్లు. వాటిని బద్దకంతో నిద్రకు అంకితం చేస్తే భవిష్యత్ తలుపులు తెరుచుకోకపోగా అంతా అంధకారమే మిగులుతుంది. అలాకాక సమయాన్ని సద్వినియోగం చేసుకొని, ముందుకు దూసుకుపోతే అంతు తెలియని జ్ఞానం మన సొంతం అవుతుంది. ఆ జ్ఞానమే ఇంకా ఇంకా శోధించాలనే తపనలకు మూలం అవుతుంది. అదే అనంత శిఖరాల అంచులపై మనల్ని నిలిపేలా చేస్తుంది. ఆ శక్తి కేవలం విద్యకే వుంది.

10, ఏప్రిల్ 2023, సోమవారం

ఛత్రపతిని అధ్యయనం చేసిన అభినవ శివాజి జ్యోతిబాపూలే

సమాజంలో ఉన్న కులవివక్ష, లింగ వివక్ష వంటి ఎన్నో అసమానతలను రూపుమాపి సమరసతను నెలకొల్పన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్ముడు జ్యోతిరావు పూలే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలో గోవిందరావు, చినామా గోవిందరావు దంపతులకు 1827 ఏప్రిల్ 11న జన్మించారు. పులే పాఠశాలకు వెళ్లి చదువుకోవడం తక్కువ కానీ పుస్తక పఠనంపై చాలా ఆసక్తి చూపేవారు. దీనిని గమనించిన అతని ఉపాధ్యాయుడు అతడిని స్కాటిష్ మిషన్ పాఠశాలలో చేర్పించారు అక్కడే తనకు ఆప్త మిత్రుడుగా నిలిచిన బిల్లాల్ గోవింద్ అనే బ్రాహ్మణుడితో పరిచయం ఏర్పడింది. పూలే సంఘ సంస్కర్తగా, తత్వవేత్తగా ఎదగడంలో తన స్నేహితుడు ప్రధాన పాత్ర పోషించాడు. పూలే అప్పుడప్పుడు పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకు హాజరయ్యేవారు ఆ సమయంలోనే ఒక పెళ్లిలో కుల వివక్ష, లింగ వివక్ష వంటి వాటిని ఎదుర్కొన్నాడు, ఆ క్షణాన్నే వాటిని రూపుమాపాలన్న దృఢమైన సంకల్పం తీసుకున్నాడు.


అభినవ ఛత్రపతి జ్యోతిరావు పూలే

సమాజంలోని అసమానతలను రూపుమాపాలన్న లక్యంతో ముందుకు సాగుతున్న పూలే, వాటిని అధ్యయనం చేయడంలో భాగంగా ఎన్నో పుస్తకాలు చదివాడు, ఎందరో సంఘ సంస్కర్తలను, ఆధ్యాత్మికవేత్తలను కలిశారు. అందులో భాగంగానే ఛత్రపతి శివాజి యొక్క జీవిత అధ్యయనం చేసి, అతనిపై అభిమానంతో గుర్తింపు లేకుండా పాడుపడిపోయి ఉన్న శివాజీ సమాధిని సొంత ఖర్చులతో పునస్థాపన చేసి ఒక దర్శనీయ స్థలంగా మార్చారు.

సమాజంలోని అసమానతలు రూపుమాటమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న పూలే దాని కోసం శ్రమిస్తూ, కుటుంబ పోషణను కూడా నడిపించేవారు. సమాజంలోని లింగవివక్షతను రుపుమాపటంలో భాగంగా ఎన్నో బాల్యవివాహాలను అడ్డుకున్నారు, వితంతు పునర్వివాహాలు జరిపించారు. మహిళల గౌరవాన్ని నిలబెడుతూ చరిత్రలోనే తొలిసారిగా గర్భ నియంత్రణ వ్యతిరేక కేంద్రాన్ని స్థాపించారు. మహిళాభ్యుదయంలో భాగంగానే తన భార్య అయిన సావిత్రి బాయి పూలేకు విద్యాబోధన చేసి తొలి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దారు.


పూలే దంపతులు

సమాజ అసమానతలు రుపుమాపటంలో భాగంగా ప్రజలలో చైతన్యాన్ని, అవగాహనను పెంపొందించడానికి అనేక పుస్తకాలు, వ్యాసాలు రాసి, కవిగా రచయితగా కూడా మన్ననలు పొందాడు. 'సార్వజనిక్ ధర్మ పుస్తక్' అనే పుస్తకం ద్వారా మతపరమైన, సాంఘిక పరమైన ఆచారాలను తీవ్రంగా విమర్శిస్తూ దిశా నిర్దేశం చేశారు. అలాగే పౌరోహిత్య బండారం, గులాంగిరి వంటి మొదలైన రచనలు చేసి తన అక్షరాలను ఆయుధాలుగా మలుచుకున్నాడు.

పురోహితుల అరాచకాలను అడ్డుకునేందుకు సార్వజనిక్ సభను స్థాపించి ప్రజలలో చైతన్యాన్ని నింపాడు. తన సేవా కార్యక్రమాలు విస్తరింపజేసేందుకు సత్యశోధక్ సమాజాన్ని స్థాపించాడు. "మనమంతా దేవుని వారసులం దేవుని దృష్టిలో మనమంతా సమానం ఈ బేధాభావాలు మనం సృష్టించుకున్నవే. నిర్బంధ విద్య, స్వదేశీ భావన, నిరాడంబరతలను అలవర్చేందుకే సత్య శోధక సమాజం" అని పూలే సంస్థ యొక్క లక్ష్యాలను నిర్దేశించారు. సంఘ సంస్కరణకు నడుం బిగించిన మరో సంఘ సంస్కర్త, ఆర్యసమాజ స్థాపకులు దయానంద సరస్వతి పునా పర్యటనకు వచ్చినపుడు అతడిని కలిసి చర్చోపచర్చలు జరిపి సమాజం గురించి ఆలోచించడం ప్రధానమైన విషయం. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబెడ్కర్ కు గురువుగా నిలిచి అనేక విద్యా బోధనలు చేసి, మార్గనిర్దేశం చేశారు.

తన జీవితాన్నే సమాజానికి దారపోసి ఎందరికో దిశానిర్దేశం చేసి, దేశ చరిత్రలోనే ప్రజలచేత తొలిసారిగా మాహాత్మ అని పిలిపించుకున్న జ్యోతిరావు పూలే జీవిత విశేషాలను జ్ఞాపకం చేసుకుని అతడి జీవిత ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నేటి సమాజం ముందుకు నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

6, నవంబర్ 2022, ఆదివారం

ఆలయాలు శక్తి జనకాలు

ఆధునిక యుగంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పవన విద్యుత్ కేంద్రాలు, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్మిషన్లు, విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు మొదలైనవి రూపుదిద్దుకోవటం మొదలై కేవలం 200 సంవత్సరాలయింది. కానీ లక్షల సంవత్సరాలకు ముందే మన ఆలయాల విమాన గోపురాలు, ధ్వజ స్థంభాలు, ఆలయ శిఖరాలు నేటి ఆధునిక యుగంలో వెలసిన సాంకేతిక పరికరాల ఆకారంలోనే నిర్మించబడి ఉన్నాయి. అందుకే లక్షల సంవత్సరాల ముందుచూపు గల మన పూర్వీకులు అనాగరికులు కాదు ఆధునికులు. వారు చేసిన మేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వ్యాసాన్ని చదివి తెలుసుకోండి.



ఔషధం

దేవాలయాల ప్రాంగణంలో ఉండే తులసి, మారేడు, రావి వంటి చెట్లు గాలిని శుభ్రం చేసే పవిత్రమైన ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయి. చెట్టు నుండి ఆకును వేరు చేసినా ఇరవైనాలుగు గంటలవరకు ప్రాణవాయువును అందించేవి మామిడాకులు. అందుకే శుభకార్యాలలో ఒకే దగ్గర అనేక మంది గుమిగూడినా అందరికీ తగిన ఆక్సిజన్ అందాలని మన సంప్రదాయాలలో మామిడి తోరణాలు కడతారు.

తంత్రం

దేవాలయాలలో అక్కడి అర్చకులు వేసే ముద్రలు సూక్ష్మ వ్యాయామంగా ఉపయోగపడి శరీరంలోని ప్రాణశక్తిని ప్రేరేపిస్తాయి. దీని ద్వారా ఏకాగ్రత శక్తి మరింత పెరుగుతుంది దీన్నే ఆధ్యాత్మికంగా చెప్తే తంత్రం అంటాము.

మంత్రం

ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణ నుండి విద్యుదయాస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనసును ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్తాయి. ఆ మంత్రాల యొక్క అర్థాలు సూక్ష్మ భావ తంరగాలుగా మారి మనస్సును ఉత్తేజపరుస్తాయి. దీన్నే మంత్రం అంటారు.

యంత్రం

దేవాలయాలను నిర్మించేటపుడు భూమి పూజ కార్యక్రమంలో అనేక రకాలైన లోహాలను, నవ రత్నాలను భూమిలో వేసి నిక్షిప్తం చేస్తారు. ఇవి భూ శక్తి గ్రాహకాలుగా పనిచేస్తాయి. తద్వారా దేవాలయంలోని శక్తి నిక్షిప్తం చేయబడుతుంది.

ధ్వజస్తంభాలకింద, మూలవిరాట్టు కింద లోహ నిర్మిత పలకలను అమర్చుతారు. ఆలయ శిఖరాలపై, ధ్వజస్థంభాలపై లోహపు కలశాలు, లోహపు తొడుగులు వేస్తారు. ఉత్సవ విగ్రహాలను సైతం పంచలోహాలతో తయారు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే లోహం అనేది శక్తికి వాహకంగా పని చేస్తుంది. వాయు పదార్థాలలో అణువులు దూరం దూరంగా ఉంటాయి, అదే ద్రవ పదార్థాలలో కొంచం దగ్గర దగ్గరగా ఉంటాయి, అదే పంచాలోహం  వంటి ఘాన పదార్థాలలో అణువులు మరింత దగ్గర దగ్గరగా ఉంటాయి. కాబట్టి వీటిలో ఒక అణువు నుండి మరొక అణువుకు శక్తి సులభంగా ప్రసరిస్తుంది. కాబట్టే ఆలయాల్లో ఇలాంటి లోహపు పదార్థాలు వాడుతారు. ఇలా వాడటాన్నే ఆధ్యాత్మికంగా యంత్రం అంటారు. మంత్ర తంత్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తికి ఈ యంత్రాలు గ్రాహకాలుగా పనిచేస్తాయి.

అభిషేకం

ఆలయాల్లో చేసే అభిషేకాలు పంచలోహ విగ్రహం అయిన మూలవిరాట్టు విగ్రహంపై ఎత్తు నుండి చేస్తారు. ఇలా ఒక లోహం పై ఒక ద్రవ పదార్థం ఎత్తునుండి పడటం ద్వారా స్థితి శక్తి గతి శక్తిగా మారుతుంది. దీన్ని మనం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో నీరు టర్పైన్ల పై పడి విద్యుత్ శక్తి ఉత్పత్తి కావడంతో పోల్చుకోవచ్చు. అంటే మన ఆలయాలలో కూడా అభిషేకాల ద్వారా గతిశక్తి ఉత్పత్తి అవుతుందన్నమాట.

ఇలా మంత్ర, తంత్ర, యంత్రాల ద్వారా విశ్వవ్యాప్తంగా అంతర్గతంగా ఉన్న శక్తిని గ్రహించి నిల్వ చేసుకొని దగ్గరకు వచ్చే భక్తులకు అందించే శక్తి నిర్వహణ కేంద్రాలు మన ఆలయాలు.

ఆలయ వ్యవస్థ

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో, జనరేటర్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్  ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా టెర్మినల్ స్టేషన్లకు వెళ్లి అక్కడి నుండి  సబ్ ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా విద్యుత్ స్థంభాల సహాయంతో  తక్కువ వోల్టేజ్ గల ఇళ్లకు, ఎక్కువ వోల్టేజ్ గల పరిశ్రమలకు అందుతుంది. సరిగ్గా ఇదే వ్యవస్థ మన ఆలయాల్లో కూడా కనిపిస్తుంది. ఎలా అంటే,  విద్యుత్తుత్పత్తి చేసే జనరేటర్ వంటి గర్భ గుడి నుండి అర్చకులనే ఎలక్ట్రిషన్స్ సహాయంతో శక్తి బయటకు వచ్చి అంతరాలయంలో ప్రయాణించి, పరివార దేవతల ద్వారా విస్తరించి, విద్యుత్ స్తంభాల వంటి ధ్వజస్థంభాల సహాయంతో  అధిక వోల్టేజ్, అల్ప వోల్టేజ్ అని ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సామాన్యుల నుండి మహా భక్తుల దాకా ఈ శక్తి అందరికీ అందుతుంది. అందుకే గుడికి వెళ్లే భక్తులు గ్రహణ శక్తిని పెంపొందించుకొని, ప్రశాంతతను పొందుతున్నారు. అదే శక్తితోనే తమకు ఉన్న సమస్యలను ఎదుర్కొంటున్నారు.

11, ఆగస్టు 2022, గురువారం

శ్రావణమాసంలో మాంసాహారం నిషేధం ఎందుకు?

శ్రావణ మాసంలో చాలా మంది మాంసాహారాన్ని నిషేధిస్తారు. అయితే ఈ నెలలో కేవలం శాకాహారానికి మాత్రమే ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హిందూ ధర్మం ప్రకారం, 

ఈ నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తారు.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, 

శ్రావణ మాసంలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇలాంటి సమయంలో వర్షాలు కూడా జోరుగా కురుస్తాయి. కాబట్టి ఈ కాలంలో మాంసాహారం, మసాలా లేదా నూనె వస్తువులను ఎక్కువగా తింటే అది రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థ కూడా సక్రమం పని చేయదు. ఇలాంటి సమయంలో మనం శాకాహారం తీసుకుంటే సులభంగా జీర్ణమవుతుంది. అందుకే ఈ నెలలో మాంసాహారానికి దూరంగా ఉండాలి.

శ్రావణ మాసంలో మన శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మరింత బలహీనంగా ఉంటుంది. ఈ కాలంలో అంటువ్యాధులు చాలా వేగంగా ప్రబలే అవకాశం ఉంది. ఇలా రోగాలు ప్రభలిన జంతువుల మాంసాహారం తీసుకుంటే మన శరీర ఆరోగ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఈనెలలో మాంసాహారానికి దూరంగా ఉంటారు.


ఇదే నెలలో జంతువులు ప్రసవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వాటిని వధించడం మంచిది కాదని, ఈ కారణంగా శ్రావణ మాసంలో మాంసాహారాన్ని తీసుకోవడాన్ని నిషేధించారు.


--✍🏻✍🏻వివేకభారతి (అభిలాష్)

23, ఆగస్టు 2021, సోమవారం

వీర వల్లడు నవలా సమీక్ష

వీరవల్లడు అనే పుస్తకం 62 పేజీలతో 19వ శతాబ్దం చివరి కాలాన్ని ప్రతిబింబింప చేసే  ఒక చిన్న  సాంఘిక నవల. పూర్వ కాలపు కట్టుబాట్లనూ, అప్పటి సంస్కృతీ, సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టు ఇందులో వివరించారు. యజమానికీ, పాలేరుకీ మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఈ నవల వివరిస్తుంది. ముఖ్యంగా ఇందులో కృతజ్ఞతా భావాన్ని 'వల్లడు' అనే ప్రధాన పాత్ర ద్వారా రచయిత చక్కగా వివరించారు. నేడు మనుషుల మధ్య లోపించిన ఈ భావాన్ని తిరిగి సాధించేందుకు తప్పకుండా చదవాల్సిన, నవల ఇది.

కవి పరిచయం:

ఈ నవలను కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు 1935-40 ప్రాంతాల్లో రచించారు. ఈయన పేరు వినగానే మనకు గుర్తొచ్చే మరో ప్రసిద్ధ రచన వేయిపడగలు. దీన్ని పి.వి. నరసింహారావు గారు సహస్రఫణ్ పేరుతో హిందీలోకి అనువదించారు. ఈయన మరో రచన శ్రీమద్రామాయణ కల్పవృక్షం దీనికి గానూ సాహిత్య ప్రక్రియల్లో అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం అయిన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతగా విశ్వనాథ గారు ప్రసిద్ధి చెందారు.

పాత్ర చిత్రణ:

ఈ నవలలో పాత్ర చిత్రణ అద్భుతంగా వుంటుంది. ఒక్క వల్లడి పాత్రే కాదు. కరణము, మునుసబు, సాయిబు, దొర, దొర భార్య సర్వలక్షమ్మ గారు, చిన్నపిల్లలు – ఇలా నవలలోని మొత్తం అన్ని పాత్రలూ కళ్ళకి కట్టినట్లుగా వుంటాయి. ఇందులో ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే వల్లడి దొర పాత్రకు పేరు లేదు. నవల ప్రారంభం నుండి చివరి దాకా వల్లడి దొర అనీ ప్రస్తావిస్తూ ఉంది.

నేపథ్యం:

విశ్వనాథ వారి కుటుంబంలో ఆయనకు రెండు, మూడు తరాల క్రితం జరిగిన వాస్తవ సంఘటనలకు కథారూపమే ఈ నవల అని విశ్వనాథ పావనశాస్త్రి చెప్పుకున్నారు. ఈ నవలను గొర్రెపాటి బాలకృష్ణమ్మకు అంకితం ఇచ్చారు.

ఇతివృత్తం:

పట్టణ వాసపు చదువుల్లో చేరిన ఓ పల్లెటూరి బ్రాహ్మణ బాలుడికి పాఠశాలలో మాస్టారు వల్లప్ప అనే తన పేరును వెక్కిరించగా తన పేరంటేనే విరక్తి ఏర్పడుతుంది. సెలవుల్లో ఇంటికి వచ్చినపుడు  తన పేరు మార్చమని తన తండ్రికి చెప్పగా వల్లడనే పాలేరు పేరు పెట్టామనీ అది గొప్ప పేరనీ తండ్రి చెప్తే అతనికి పేరు మార్చుకోవాలని ఇంకా పట్టుదల పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తన చిన్నతనంలో వల్లని గురించి దాదాపు ఇదే పరిస్థితుల్లో విన్న కథను ఆయన కొడుక్కి చెప్తాడు. తన దొర మరణానంతరం ఆయన కుటుంబానికి ఆస్తి దక్కకుండా చేసిన దొర బాబాయిని ఒంటరిగా ఎదిరించి, నేర్పుగా వ్యవహారాన్ని చక్కబెట్టి ఎలా ఆస్తి తిరిగి రప్పించాడన్నదే వల్లడి కథ. పందొమ్మిదవ శతాబ్ది తొలినాళ్ళలోని భూవ్యవహారాలు, ఆనాటి కులకట్టుబాట్ల మధ్య ఈ కథను రచయిత నడిపిన తీరు ఆకట్టుకుంటుంది.

సంక్షిప్త కథ:

వల్లడు ఒక మాల కులానికి చెందిన పాలేరు.  అతని దొర ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడి పూర్వులలో ఒకాయన ఒక అడవిలాంటి ప్రదేశాన్ని చూసి, అది మంచి ప్రదేశమని గుర్తించి, దానిని ఊరుగా మార్చి అక్కడ నివసించాలని నిర్ణయించుకుంటాడు. మొదట అక్కడ తను ఒక పాక వేసుకుని భార్యా పిల్లలతో కాపురం పెడతాడు.

ఆ తర్వాత ఒక రోజు ఆ దారిన పోతున్న వల్లడి పూర్వీకుడు ఆకలితో ఆ పాక దగ్గరికి వస్తే అతనికి ఆ బ్రాహ్మణుడు అన్నం పెడతాడు. ఆ బ్రాహ్మణుడు తన నిర్ణయం అతనితో చెప్పి “నాకు సాయంగా వస్తావా?” అని అడుగుతాడు. ఒక పూట అన్నం పెట్టాడన్న కృతజ్ఞతతో వల్లడి పూర్వీకుడు జీవితమంతా ఆయన దగ్గర ఉండడానికి సిద్ధమై భార్యా పిల్లలని తీసుకుని వచ్చేస్తాడు.

ఆ తర్వాత కమ్మవారినీ, ఇతర కులాల వారినీ తీసుకొచ్చి వాళ్ళకి భాగాలు పెట్టి అడవంతా కొట్టి దాన్నొక ఊరుగా తయారు చేస్తారు. అప్పటి నుండి వల్లడి వంశం వారు , ఆ బ్రాహ్మణుడికి తరతరాలుగా పాలేరు పని చేస్తూ వస్తారు. 

వల్లడి దొర కుటుంబానికి సంబంధించిన పొలం ఉమ్మడిగా వుంటుంది. ప్రతితరం లోనూ పెద్ద కొడుకు సంతానానిదే అధికారం కనుక ఆ లెక్క ప్రకారం వల్లడి దొరదే పెత్తనం కావాలి. కానీ వరుసకి బాబాయి అయిన ఒక పెద్దాయన రాయుడుగారు వుండడం వలన వల్లడి దొర ఆయనకి గౌరవమిచ్చి ఆయన పేరు మీదగానే అంతా నడిపిస్తూ వుంటాడు. అయినా ఆ రాయుడుగారికి మనసులో కొంత అసంతృప్తి వుంటుంది.

హటాత్తుగా దొర చనిపోవడంతో రాయుడుగారు పెత్తనమంతా తన చేతిలోకి తీసుకుని, వల్లడి దొర పెళ్ళాం పిల్లల గురించి పట్టించుకోవడం మానేస్తాడు. ఊర్లో పెద్దలందరినీ తనవైపు తిప్పుకుని పొలం మొత్తం తానే అనుభవించాలనుకుంటాడు. తిండికి జరగని పరిస్థితులలో ఆవిడ పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆవిడ అన్నదమ్ములూ రాయుడుగారిని ఎదుర్కునేంత శక్తి లేక చేతులు ముడుచుకు కూర్చుంటారు. అయితే పాలేరు వల్లడు అలా ఊరుకోలేకపోతాడు. ఆవిడని మళ్ళీ ఊరికి తీసుకు వచ్చి ఆవిడ ఆస్తి ఆవిడకీ, ఆవిడ పిల్లలకీ దక్కేలా చేస్తాడు.

శైలి:

కథాప్రారంభ ఘట్టాల్లోని కథాకాలానికి వల్లని కథలోని కథాకాలానికి రెండు తరాల అంతరం ఉంటుంది. రచయిత ఆయా ఘట్టాల్లోని పాత్రల భాషలో చక్కని సూక్ష్మమైన బేధం  చూపించారు. నవలలో ఆనాటి గ్రామ వ్యవహారం ఎలా ఉంది అనేది కళ్ళకు కట్టినట్టు చక్కగా వివరించారు.

ఉదాహరణ సన్నివేశాలు:

1. "వల్లడు అన్న పేరు చాలా మంచి పేరు. ఒక్కొక్క పేరు - ఒక్కొక్క విధంగా మంచిదోయి. కృష్ణుడు అన్న పేరుందనుకో ఆ పేరు మంచిది కాదని ఎవరూ అనరు కదా! ఎందుకు అనరు? కృష్ణుడు గొప్ప పనులు చేశాడు గనుక. ఆపేరు అందరికీ మంచిది అనిపిస్తుంది." - పేరు మార్చమని అడిగిన వల్లడికి అతడి తండ్రి  చెబుతున్న మాటలివి. పేరు గురించి, పేరు ప్రాధాన్యత గురించి ఈ మాటల్లో రచయిత వివరించారు. మన పేరును మనం ఎప్పుడూ చులకన భావంతో, తక్కువచ్చేసి చూడరాదు అన్న విషయాన్ని ఈ మాటల ద్వారా గ్రహించవచ్చు.

2. "ఊరు మీద ఊరు పడ్డా కరణం మీద కాసు పడదు, ఎదుటి వాడి మేలు ఓర్వకపోతే మన సరదా మంటగలుస్తుంది, " -  ఈ మాటలు గ్రామ కరణం తో రంగమ్మ  అనే ఆవిడ అంటుంది. ఈమె మాట్లాడే మాటలు మంచి నైతికతను బోధించేవిగా ఉంటాయి.

3. "ఒసేయ్! పెడతానో పెట్టనో తెలియని అన్నానికే వెంటబడుతున్నావే నువ్వు. తరతరాలుగా మా దొరల నీడన దొరల్లాగా బ్రతికిన వాళ్ళం మేము నేనెట్టాపడాలి  మా దొరల వెంట?" ఈ మాటలు వల్లడు ఒక కుక్కను చూసి అన్నాడు. వల్లడు తన దొరసానిని వెతుకుతూ వెళ్ళినపుడు మధ్యలో ఆహారం ఇచ్చి ఒకావిడ సహాయపడుతుంది. కానీ తన దొరసానిని ఇంటికి తీసుకొచ్చే వరకు భోజనం చేయకూడదని శపథం చేసుకొని ఉంటాడు వల్లడు.  తద్వారా ఆ ఆహారాన్ని ఒక చెరువు గట్టు వద్దకు తీసుకువెళ్తూ ఉంటే ఆ ఆహారం కోసం ఒక కుక్క వెంబడించినపుడు ఆ కుక్కను చూసి వల్లడు ఈ మాటలు అంటాడు. ఈ మాటలను బట్టి ఆ యజమానికి, పాలేరు వల్లడికి మధ్య ఎంత పటిష్టమైన అవినాభావ సంబంధం ఉందో తెలుస్తుంది. ఇలాంటి మాటలు ఈ నవలలో కోకొల్లలుగా ఉంటాయి.

నవల పై నా అభిప్రాయం:

నవల చాలా చిన్నది కాబట్టి సమయం వెచ్చించి చదివితే రెండు లేదా మూడు గంటల్లో పూర్తి నవలను చదవవచ్చు. కానీ వివరించాలి అంటే ఒక్కరోజైనా తక్కువే. నవలలోని ప్రతీ సన్నివేశం మన కట్టుబాట్లను ప్రతిబింబించేవిగా ఉంటాయి. పూర్వకాల సంప్రదాయాలు, ఆనాటి కట్టుబాట్లను తెలుసుకోడానికి ఒక చక్కని పుస్తకం ఇది. ఆధునిక సమాజంలో నాటి సంప్రదాయం పట్ల ఉన్న అనేక అపోహలను తొలగించేదిగా ఈ నవల ఉంది. 

11, మే 2021, మంగళవారం

సెలవుకు సెలవు

 ఏ పురుగూ తలదూర్చకుండా

ఏ మనిషీ మితిమీరకుండా 

వేయి కనులతో కాపుగాస్తున్నారు

తీరం లేని ప్రయాణమే చేస్తున్నారు

తీరె మారాలని సాధననే చేస్తున్నారు

పోలీసు బందోబస్తు తో..

భారత భవిష్యం సుభిక్షమంటున్నారు


నీ కోసం తన వారిని దూరంపెట్టి

నీ సేవ కోసం తన ప్రాణం పణం పెట్టి

సెలవుకు సెలవు ఇచ్చి

మన ప్రాణానికి విలువిచ్చి

మన నవ్వుతో తన కష్టాన్ని మరిచే

నిత్య శ్రామికులు, మార్గదర్శకులు

భారత భవిష్యం సుభిక్షం అంటున్నారు


భారత బాగోగులు చూస్తున్నారు

భారీ క్వారెంటైన్లు ఏర్పాటు చేస్తున్నారు

మెడిసిన్లే అస్త్రాలు గా యుద్ధం చేస్తున్నారు

వైద్యులుగా భారత భవిష్యం సుభిక్షమంటునన్నారు


గాలికి తెగిన గాలిపటంలా

దారే తెలియక చూస్తున్నారు

రేయి పగలు నిదురనే మాని

దేశ దేశాల్లో

నీ ఆనవాళ్ళను

వెలికితీస్తున్నారు

వారే నీ పాలిట యమదూతలు శాస్త్రవేత్తలు

 

కరోనా నిన్ను

సంఘటితంగా

సాగనంపుతాం

సమూలంగా నిర్మూలిస్తాం

నాటి నారదుడే నేటి విలేఖరి. (కవిత)

తెల్ల బట్టలు

మెడలో స్టెతస్కోప్ లు

మెడిసిన్ లే ఆయుధాలు

దవాఖాన ల దాపురించిన

డాక్టర్లే దేవుళ్ళు


సమాచారమే సాహిత్యము

ప్రజాక్షేమమే సంతోషము

కదన రంగాన కట్టడి చేసిన

నాటి నారదుడే నేటి విలేఖరి


ఊరు స్వచ్చం

వాడ పరిమళం

నెత్తిన గంపలు

చేతిల చీపుర్లు

చీల్చి చండాడుతున్న

పారిశుధ్య కార్మికులు దేవుళ్ళు.

ఆదర్శం (కవిత)

 గెలుపు కుందేలు ది కాదు తాబేలు దే..
ఓర్పు ఉన్న 🐡*తాబేలు* ఆదర్శం

విడిపోయిన రెండింటిని కలపడానికి తాపత్రయ పడే 🥢*సూది* ఆదర్శం...

తన మూలంగా లోకం ఆగిపోకూడదని రోజంతా వెలుగునిచ్చే 🌞*సూర్యుడు* ఆదర్శం...

తను కరిగిపోయినా పక్కవాల్లకు వెలుగునివ్వాలనుకునే
🕯️ *కొవ్వొత్తి* ఆదర్శం...

తీరాన్ని సంద్రంగా మార్చాలని అనుక్షణం ప్రయత్నించే *అలలు*🌊 ఆదర్శం..

పడకొట్టిన వాడిపైన పగపట్టకుండా,
 
దారం దారం పోగేసుకుని మరో గూడు కట్టుకునే *సాలేపురుగు*🕸
ఆదర్శం..
🍃🌸🍃🌸🍃🌸🍃🌸

కలిసేలా చేసిన కరోనా (కవిత)

 కనిపించని కరోనా అది

యాస లేని మహమ్మారి అది

యాది మరిచి చైనానే

యాలడవడింది మన గుమ్మమ్ముందే

యాది మరిచి బయటికోతే

మతితప్పిన మహమ్మారి పట్టుకుంటే

అస్తికల జాడ కూడా దొరకనట్టు 

బూడిద కూడా కనిపించనట్టు

కనుమరుగై పోతావు 

కనిపించని కరోనా అది

కనిపించని అనుభూతుల్ని

కలయికతో వచ్చే సంతోషాన్ని

కలవరపెట్టే మాధుర్యాన్ని

కమ్మని వంటింటి వంటకాన్ని 

కలిసేలా చేసింది కరోనా.

కనిపించని కరోనా అది

తెలుగు బంధం (కవిత)

 అచ్చులు హల్లులు అమ్మా నాన్నలు

భాషాభాగాలు బాబాయీ లు

పదబంధాలు పలకరించే పిన్నమ్మలు

అన్నయ్యలు అన్నింటికీ అలంకారాలు

ఒత్తుల వరసలు వదినమ్మలు

తమ్ముళ్లు తోడుండే తెలుగు వెలుగులు

ఛందస్సే చిలక పలుకుల చెల్లెమ్మ

విద్యనందించే లఘువులు, గురువులు

బహువచనాలు బావమరుదులు

సంధులు, సమాసాలు చుట్టాలు పక్కాలు

విభక్తులు వీధి స్నేహితులు

ప్రతిపదార్థాలు ప్రాణ స్నేహితులు

విమర్శించే వాళ్ళు వ్యతిరేక పదాలు

సమర్థించే వాళ్ళు వ్యుత్పత్తర్థాలు

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...